హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తమిళనాట ‘తెలంగాణ మాడల్’ రైతు సంక్షేమ పథకాల అమలు, సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం జూన్లో కోయంబత్తూరులో నిర్వహించనున్న రైతుల బహిరంగసభకు హాజరుకావాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య ఆహ్వానించింది. సమాఖ్య చైర్మన్ కోటపాటి నరసింహంనాయుడు నేతృత్వంలో తమిళనాడు రైతు సంఘాల నాయకులు పీకే దైవ శిగామని, కేఎం రామగండర్, ఏకే బాబు, ఆశా తదితరులు శుక్రవారం కోయంబత్తూరులో స్టాలిన్ను కలిశారు.
ఈ సందర్భంగా నరసింహంనాయుడు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఈ సభకు ఆహ్వానించాలని స్టాలిన్ సూచించారని వెల్లడించారు. కేసీఆర్ను కూడా ఆహ్వానిస్తున్నట్టు స్టాలిన్కు వివరించామని తెలిపారు. బహిరంగసభ తేదీని త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. కోయంబత్తూరు ప్రాంతంలో తెలుగు ప్రజలు 27 శాతం వరకు ఉంటారని పేర్కొన్నారు.