నాగర్కర్నూల్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో రైతును మించిన శాస్త్రవేత్త లేడని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని పిలుపునిచ్చారు. వ్యవసాయానికి గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. రైతు ఒక్కడే నిజాయతీ పరుడని కొనియాడారు. ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి,ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డితో కలిసి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వానకాలం- 2022 సాగు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. ఇందులో భాగంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని స్పష్టంచేశారు.
పత్తి ఎంత పండించినా లాభమే అని రైతులకు సూచించారు. ప్రభుత్వ విధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందని, ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరిగిందని చెప్పారు. చిన్న గ్రామంలో పండుగ చేస్తే రూ.3 కోట్లు, పెద్ద గ్రామంలో అయితే రూ.6 కోట్ల వరకు ప్రజలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక వృద్ధిరేటు విషయంలో రాష్ట్రం దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని పునరుద్ఘాటించారు. రైతు వేదికలు రైతులకు ఆదర్శప్రాయమైన బాట చూపించాలన్నారు. రైతు కేంద్రంగా నడిచే ప్రభుత్వం టీఆర్ఎస్ అని, రైతుబిడ్డ సీఎంగా ఉన్నది కేసీఆరే అని స్పష్టంచేశారు. వ్యవసాయ రంగానికి రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. కాళేశ్వరంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుని ప్రతి ఎకరాకు నీరు పారించుకొంటున్నామని వెల్లడించారు. రైతులు పంట మార్పిడి పాటించి లాభాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఆయిల్పాం సాగు 2 లక్షల ఎకరాలకు చేరిందని చెప్పారు. ఆయిల్పాం సాగు చేస్తే తెలంగాణ సర్కార్కు సెల్యూట్ చేసి మరీ కేంద్రమే కొనుగోలు చేస్తుందన్నారు.
రాష్ట్రంలో పండిన వడ్లను తామే కొంటామన్న బీజేపీ నేతలు ఎక్కడైనా కనిపిస్తున్నారా? అని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. మా కులం నాయకుడికే ఓట్లు వేయండని ఓ నాయకుడు అంటుండని, మత పిచ్చితో ప్రచారం చేస్తూ హైదరాబాద్, మహబూబ్నగర్లో అల్లకల్లోలాలకు మరో నాయకుడు కుట్రలు చేస్తున్నాడని రేవంత్రెడ్డి, బండి సంజయ్ను ఉద్దేశించి ధ్వజమెత్తారు. కుల, మత పిచ్చిగాళ్లను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాటలను నమ్మే పిచ్చోళ్లు తెలంగాణలో లేరని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఎడ్ల బండి కింద పోయే కుక్క తనే బండిని మోస్తున్నదని అనుకున్నట్టుగా బండి సంజయ్ వ్యవహారశైలి ఉన్నదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 2,600 మంది ఏఈవోలు రైతులకు సలహాలు ఇస్తూ తలలో నాలుకలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని 30 లక్షల బావులు, బోర్లకు కరెంట్ మీటర్లు పెట్టకుండా నిరంతర ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని స్పష్టంచేశారు. రైతుబంధు ద్వారా రూ.50,500 కోట్లు ఇచ్చామని, ఈ నెల 28 నుంచి వానకాలం రైతుబంధు కింద రూ.7,800 కోట్లు అందజేస్తామన్నారు. 83 వేల మందికి రైతుబీమా కింద రూ.5 లక్షల చొప్పున అందించామని చెప్పారు. రైతుబంధు సమితి కార్యకర్తలకు గౌరవ వేతనంపై సీఎం కేసీఆర్తో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రైతుబంధు సమితికి ప్రొటోకాల్ కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. రైతు వేదిక నిర్వహణకు ప్రతి నెలా రూ.9 వేలు అందజేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్లు స్వర్ణసుధాకర్రెడ్డి, వనజ తదితరులు పాల్గొన్నారు.
to be trained in , says