హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలో జనాభా గణనతోపాటు కులగణనను కూడా చేపట్టాల్సిందేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు మరోసారి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బుధవారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించారు. ప్రస్తుతం జనగణన నమోదు రిజిస్టర్లో 35 పట్టికలున్నాయని, మరో పట్టికను పెడితే రూపాయి ఖర్చు లేకుండా కులగణన చేయవచ్చని కృష్ణయ్య వివరించారు. 70 కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయకుండా భారత్ అగ్రదేశంగా తయారవుతుందా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కులగణన చేపట్టాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్తోపాటు ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ర్టాల ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో తీర్మానించాయని, జాతీయ, ప్రాంతీయ పార్టీలూ డిమాండ్ చేస్తున్నాయని, అనేక బీసీ కమిషన్లు సిఫారసు చేశాయన్నారు. అయినా కేంద్రం బీసీ వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నదని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా కులగణన చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, మాజీ పార్లమెంట్ సభ్యుడు అజీజ్పాషా, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.