సూర్యాపేట : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు రైతులు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. సంజయ్ చేపట్టిన యాత్ర రైతు భరోసా యాత్ర కాదని..ఇది ముమ్మాటికి రైతు భక్షణ యాత్ర అని అన్నదాతలు మండిపడుతున్నారు. ఉద్యమాల గడ్డపై తొండి చేసే బండి సంజయ్ నాటకాలు సాగవని రైతులు తెగేసి చెబుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు బండి చేపట్టిన యాత్రలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. రైతులు రోడ్ల పైకి వచ్చి బండికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రైతుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవుతుండంటంతో బండి సంజయ్ డైలమాలో పడ్డారు.
తాను చేపట్టిన యాత్ర సరైందేనా అని మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. యాత్రపై రైతులు కన్నెర్ర జేస్తుండటంతో రూటు మార్చాడు. చివ్వేంల మండలం వీకే పహాడ్ క్రాస్ రోడ్డు వద్ద రైతులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున చేరి బండి కాన్వాయిని అడ్డగించడంతో సుమారు రెండు గంటల పాటు కారులోనే ఉన్నాడు.
చేసేదేం లేక రోడ్డు వెంట ఉన్న ధాన్యం కుట్టి వేసిన బస్తాల వద్ద కొంతమంది నాయకులతో మాట్లాడి ఆత్మకూరుకు బయలు దేరారు. ఈ క్రమంలో షెడ్యూల్లో లేని గ్రామం అయిన లక్ష్మీ నాయక్ తండాలో ఉన్న చిన్న ఐకేపీ కేంద్రం వద్ద రైతులు తక్కువగా ఉన్న దగ్గర ఆగి కాసేపు మాట్లాడి ఆత్మకూరుకు వెళ్లాడు. అక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుండటంతో బీజేపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.