వనపర్తి, జూన్ 25 (నమస్తే తెలంగాణ): అన్నదాతలు సంప్రదాయ పంటల సాగును వదిలి, అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టిసారించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించి, ఆయిల్పాం మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఒక్కరోజే జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో 71 మంది రైతులకు చెందిన 330 ఎకరాల్లో 15 వేల ఆయిల్పాం మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో బైబ్యాక్ గ్యారంటీ పాలసీ ఉన్న ఏకైక పంట ఆయిల్పాం అన్నారు.
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని చెప్పారు. ఏటా రూ.80 వేల కోట్ల విలువైన వంట నూనెలను దేశం దిగుమతి చేసుకుంటుందని, ఇక్కడే పామాయిల్ పండిస్తే రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 79 క్షేత్ర పర్యటనల ద్వారా 8,460 మంది రైతులకు ఆయిల్పాం తోటల సాగు, ఇతర అంశాలపై అవగాహన కల్పించామని చెప్పారు. ఆయిల్పాం తోటల్లో అంతర పంటలు వేసి అదనపు ఆదా యం ఆర్జించవచ్చని వివరించారు. పప్పు, నూనె గింజల సాగు దిశగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో తొలి విడతగా 3,420 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.