ఇల్లంతకుంట, ఫిబ్రవరి 28: ఆరుగాలం కష్టించి సాదుకుంటున్న పంటలు నీరు లేక కండ్ల ముందే ఎండిపోతున్నాయని, ప్రభుత్వం తమ గోడును అర్థం కేసుకుని వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు నిత్యం రోడ్డెక్కుతున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేటలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు.
ఈ సందర్భంగా అన్నదాతలు మాట్లాడుతూ.. గతంలో ప్రతి యాసంగి పంటకు నీళ్లిచ్చేందుకు అన్నపూర్ణ ప్రాజెక్టు ద్వారా అనంతారం చెరువును కాళేశ్వరం జలాలతో నింపేవారని, తర్వాత బిక్కవాగు నుంచి పిల్ల కాలువ ద్వారా రహీంఖాన్పేట చెరువును నింపేవారని గుర్తుచేశారు. ఏటా నీళ్లు రావడంతో సాగుకు ఇబ్బంది కాలేదని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని, పంటలకు నీళ్లు రావడం లేదని వాపోయారు. గ్రామంలో 3 వేల ఎకరాల వరకు వరి ఆయకట్టు ఉందని, ఇప్పటికే 500కుపైగా ఎకరాలు ఎండిపోయాయని కన్నీటిపర్యంతమయ్యారు. మున్ముందు నీళ్లివ్వకపోతే పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
కేసీఆర్ పాలనలో రైతులకు సాగునీటి కష్టాలు చూడలేదని, సంబురంగా సాగు చేసుకున్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి కోసం అరిగోస పడుతున్నామని చెప్పారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సాగునీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. లేకుంటే పంటలు ఎండిపోయి.. పెట్టిన పెట్టుబడి రాక.. అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని హెచ్చరించారు.