బిచ్కుంద, డిసెంబర్ 15 : ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో సోయా పంటను కొని, వారం రోజుల తర్వాత నాణ్యత లేదంటూ తిరిగి పంపించడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గోపన్పల్లికి చెందిన 20 మంది రైతులు ఈ నెల 10న బిచ్కుంద రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సోయా పంటను విక్రయించారు.
కాగా 1200 బస్తాల సోయా పంటను (మూడు లోడ్ లారీలు) నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్) అధికారులు ఆదివారం తిరిగి పంపించారు. దీంతో రైతులు సొసైటీ ఎదుట బైఠాయించి, తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. కొనుగోలు సమయంలో నాణ్యతా ప్రమాణలు పాటించి అమ్మితే ఐదురోజుల తర్వాత నాణ్యత లేదని తిరిగి పంపడం ఏంటని ప్రశ్నించారు. సొసైటీ అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.