అచ్చంపేట రూరల్, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా పాట్లు పడుతున్నారు. మద్దతు ధర కోసం ఇప్పటికే అచ్చంపేటలో వేరుశనగ రైతులు రెండుసార్లు రోడ్డెక్కినా ఫలితం లేకపోవడంతో బుధవారం మరోసారి ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్, బల్మూరు మండలాల నుంచి దాదాపు 669 మంది రైతులు 40,596 బస్తాల (10,149 క్వింటాళ్ల) పల్లిని స్థానిక మార్కెట్కు తీసుకొచ్చారు.
క్వింటా పల్లికి ప్రభుత్వం రూ.6,309 మద్దతు ధర నిర్ణయించగా.. పంట నాణ్యత బాగుంటే క్వింటాకు గరిష్ఠంగా రూ. 7,029, మధ్యస్తంగా ఉంటే రూ.6,380, నాణ్యత బాగాలేకపోతే రూ.5,015 చెల్లించాలని వ్యాపారులు నిర్ణయించారు. మార్కెట్కు వచ్చిన వేరుశనగలో దాదాపు సగం కొనుగోలు చేశారు. మిగిలిన పల్లికి తక్కువ ధర చెల్లిస్తామని వ్యాపారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.