హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ఉత్తరాలు(Post cards) రాస్తూ అన్నదాతలు(Farmer) ప్రారంభించిన పోస్టు కార్డు ఉద్యమం ఉధృత మవుతున్నది. ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేట నుంచి రైతులు పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టగా అది క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు రైతులు ఉత్తరాలనే ఆయుధాలుగా చేసుకొని ఉద్యమిస్తున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన రూ.500 బోనస్, రుణమాఫీ, రైతుభరోసా, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తానన్న హామీలు అలాగే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని లేఖలు రాశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తక్షణమే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, గత శాసనసభ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు.