రామగిరి, నవంబర్ 28: రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని మోదీ సర్కార్ పతనం కావాలంటే దేశంలోని రైతులంతా ఏకం కావాలని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి బిజ్జుకృష్ణన్ అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలను పురస్కరించుకుని రెండో రోజు సోమవారం నల్లగొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం అచ్చేదిన్ నినాదంతో ప్రజలను మోసగిస్తున్నదని మండిపడ్డారు. అంబానీ, అదానీ వంటి బడా కార్పొరేట్ వ్యక్తులకు రూ.లక్ష కోట్ల రుణమాఫీ చేసిన కేంద్రం కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి నాథన్ కమిషన్ సిపార్సుల ప్రకారం రైతులకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలన్ని అనుసరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, నువ్వా మైదా రైతు రాష్ట్ర కన్వీనర్ కందాళ ప్రమీలమాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.