హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, అన్ని సౌకర్యాలు నిలిపేశారని ఆ రాష్ట్ర రైతు ఉద్యమ నేత బాదరి పర్వీన్ తెలిపారు. అంతకు ముందునుంచీ రైతులకు అందిన సంక్షేమ పథకాలకు నిధుల్లో కోత పెట్టి నిర్వీర్యం చేశారని విమర్శించారు. యోగి ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప.. రైతు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవని ఆరోపించారు. ప్రగతిభవన్లో రెండు రోజులపాటు సీఎం కేసీఆర్ నిర్వహించిన జాతీయ రైతు సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యూపీ వ్యవసాయ రంగ పరిస్థితులపై తన అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు.
యూపీలో నీళ్లు, కరెంట్ లేవు
యూపీలో రైతులు రోజూ చస్తూ బతుకుతున్నారు. సాగు చేద్దామంటే నీళ్లు ఉండవు.. కొద్దిపాటి నీళ్లను వాడుకుందామంటే కరెంట్ ఉం డదు. నానా కష్టాలు పడి పండించే కాస్త పంటలకు ఎరువులు దొరకవు. ఇలా రాష్ట్రంలో రైతు లు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 100 ఎకరాలకు నీళ్లు అవసరమైతే ప్రభుత్వం 10 ఎకరాలకే అందిస్తున్నది. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తెలంగాణలో రైతులకు సాగుకు అవసరమైన నీళ్లను అందించడంతోపాటు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయడం గొప్ప విషయం. పంట పెట్టుబడి కోసం డబ్బులు ఇవ్వడం అద్భుతం. మా రాష్ట్ర ప్రభుత్వం తీరుతో మా రైతులు ఆకలితో చస్తుంటే.. ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం ఆసరాతో ఇక్కడి రైతులు మాత్రం దేశానికి అన్నం పెడుతున్నారు.
పంటను అమ్ముకోలేని దుస్థితిలో మా రైతులు..
పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో యూపీ రైతులు ఉన్నారు. ప్రభుత్వం కొంతమేరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నది. మిగిలిన పంటను రైతులే బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాలి. దీంతో దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. తక్కువ ధరకే పంటలు కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. తెలంగాణలో పరిస్థితిలో చూశాక ఆశ్చర్యం వేసింది. ధాన్యం కొనుగోలుకు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం. తెలంగాణ రైతుల తమ పంటను అమ్ముకొనేందుకు యూపీ రైతుల మాదిరిగా కష్టపడాల్సిన అవసరం లేదు.
అభివృద్ధి జాడ లేదు.. అవినీతికి అంతులేదు
ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. దీనికి తోడు అవినీతి భారీగా పెరిగిపోయింది. మత విద్వేషాలను రెచ్చగొడుతూ పాలన సాగిస్తున్నారు. వ్యవసాయరంగ అభివృద్ధిపై యూపీ ప్రభుత్వం కనీస దృష్టి కూడా పెట్టడం లేదు. దీంతో రైతులకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు మత కలహాలు సృష్టిస్తున్నారు. అమాయక ప్రజలు వారి మాయ మాటలు నమ్మి అభివృద్ధికి దూరమవుతున్నారు.