హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంపుపై దృష్టిసారించాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. ఉత్పాదక పెంపుతో రైతులకు మరింత ఆదాయం సమకూరడంతోపాటు యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం వ్యవసాయ, అనుబంధ రంగాలపై బీఆర్కేఆర్ భవన్లో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్కుమార్ మాట్లాడుతూ.. ఈ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెరిగేలా చూడాలని కోరారు.
అందరి భాగస్వామ్యంతో ఈ రంగాల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం రంగం బలోపేతమైందన్నారు. ఉచిత విద్యుత్తు, సాగునీటి సౌకర్యం, రైతుబంధు వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 64 శాతం పెరిగిందని వివరించారు. ఇప్పటికే పలు పంటల్లో నూతన విధానాలను రైతులకు పరిచయం చేశామని, ఎక్కువ ఉత్పాదకత వచ్చేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్సిన్హా, శాంతికుమారి, అరవింద్ కుమార్, రామకృష్ణారావు, డీజీపీ మహేందర్రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.