సంగారెడ్డి, మే 23 : కాంగ్రెస్ పాలనలో రైతులు(Farmers) అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. రోజుకో సమస్యతో విలవిల్లాడిపోతున్నారు. తాజాగా తడిసిన ధాన్యం(Wet grain) కొనడం లేదని సంగారెడ్డి (Sangareddy) మండలంలోని కులబ్గూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం రైతులకు, కేంద్రం సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చింతలపల్లిలో నిర్వహించాల్సిన కొనుగోలు కేంద్రాన్ని ఆ గ్రామంలో స్థలం అనుకూలంగా లేకపోవడంతో మండలంలోని కులబ్గూర్ గ్రామంలో ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు.
గురువారం పలువురు రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా, మ్యాచర్ రాదని, ఇక్కడే ఆరబెడితే ఎండిన తర్వాత ఆ ధాన్యం కాంటా వేస్తామని సిబ్బంది చెప్పడంతో రైతులు కోపోద్రక్తులయ్యారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే చెప్పినా మీరెందుకు కొనడం లేదని కొనుగోలు కేంద్రం సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడే ఉన్న ఇతర రైతులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆ రైతులు వినిపించుకోలేదు. ఇప్పుడే తమ ధాన్యం కొనుగోలు చేయాలని ఆ రైతులు పట్టుపట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతులు, కొనుగోలు కేంద్రం సిబ్బందికి తోటి రైతులు నచ్చజెప్పడంతో కొద్దిసేపటి తర్వాత సమస్య సద్దుమణిగింది.