Telangana | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): విత్తనాల కోసం రైతులు మళ్లీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగు కోసం సన్నద్దమవుతున్న రైతులలు గంటల పాటు షాపుల ఎదుట క్యూలో నిలబడాల్సిన దుర్భర స్థితి నెలకొన్నది. ఎండలో నిలబడే ఓపిక లేక పాస్ పుస్తకాలు, చెప్పులను క్యూలో పెడుతున్నారు. తొమ్మిండ్లుగా విత్తన కష్టాలకు దూరంగా ఉన్న రైతులకు… నేడు మళ్లీ ఆ పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. విత్తనాల సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జనుము, జీలుగ, పిల్లిపెసరను సీజన్ ప్రారంభంలో పొలంలో పెంచి ఆ తర్వాత కలియ దున్నడంతో నత్రజని ఉత్పత్తి అవుతుంది. దీంతో రసాయన ఎరువుల వినియోగం తగ్గడంతో పాటు ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది. దీన్ని ప్రోత్సహించేందుకు గానూ బీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్కు ముందే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచేది. కానీ కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం విత్తనాల పంపిణీలో విఫలమైంది. మొత్తం 50వేల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంగా ఉంచినట్టు తెలిసింది. వీటిని క్షేత్రస్థాయిలో సరఫరా చేయడంలో విఫలమైంది. దీంతో సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో రైతులు నానా తంటాలు పడుతున్నారు. అధికారులు టోకెన్లు జారీ చేసి ఇస్తుండడంతో రైతులు ఉదయాన్నే షాపుల ఎదుట క్యూ కడుతున్నారు.
ఈ ఏడాది 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకు 1.20 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయి. మంత్రి తుమ్మల విత్తనాల లభ్యతపై సమీక్ష కూడా నిర్వహించారు. అయినప్పటికీ కొరత మాత్రం తప్పలేదు. ముఖ్యంగా పత్తి సాగు అధికంగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొన్నది.
ఈ సీజన్లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ భావిస్తున్నది. 16.50 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు, 1.20 కోట్ల పత్తి విత్తనాల ప్యాకెట్లు.. ఇలా మొత్తం 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ ఈ సీజన్లో ముందుగానే వర్షాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ముందుగా అంచనా వేయడంలో విఫలమైన వ్యవసాయ శాఖ విత్తనాలను క్షేత్రస్థాయిలో మాత్రం సిద్ధం చేయించలేకపోయింది. దీంతో విత్తనాల కొరత ఏర్పడింది. ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ కార్యాచరణలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందనే విమర్శలున్నాయి.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో రైతులు విత్తనాలు, ఎరువుల కొరతను మర్చిపోయా రు. పక్కా ప్రణాళికతో వ్యవహరించి సీజన్ ప్రారంభానికి ముందే క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన వాటిని సిద్ధం చేసేది. కానీ కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.