ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే రాజయ్య
వేలేరు, సెప్టెంబర్ 8: పశుపోషణతో రైతు లు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మె ల్యే టీ రాజయ్య అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాడి పంటలు ఉంటే నే పల్లెలు సస్యశ్యామలం అవుతాయన్నారు. కృత్రిమ గర్భధారణ విధానంలో మేలుజాతి రకాలైన ఆవులను, గేదెలను ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. తద్వారా పాల ఉత్పత్తి పెరిగి రైతులు అధిక లాభాలను ఆర్జించవచ్చని పేర్కొన్నారు. పాడి సంపదను వృద్ధి చేసుకోవాలని కోరారు. ధర్మసాగర్, వేలేరు మండలాలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 50 పాడి యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. రెండు మండలాలకు యూనిట్ల సంఖ్యను మరో 200లకు పెంచేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు.