కరీంనగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): అది తాహెర్ కొండాపూర్. కరీంనగర్ మండలంలో చిన్న గ్రామం. 610 ఎకరాల సాగు భూమి ఉంటుంది. యాసంగిలో 570 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వరి పంట కోతకు వచ్చింది. ఇద్దరు రైతులు మాత్రమే నాలుగు ఎకరాల్లో కోతలు పూర్తి చేశారు. ఈ నెల 22న వడగండ్లు చుట్టు ముట్టాయి. అరగంటలో ఊరంతా పొర్క పొర్క అయ్యింది. చేతికి వచ్చిన పంట రాళ్లపాలవడంతో రైతులు బోరున విలపించారు. ఆ రోజు రాత్రి, మరుసటి రోజు ఏ ఇంటిలోనూ పొయ్యి వెలగలేదు.
ఆదివారం మంత్రి గంగుల కమలాకర్ గ్రామాన్ని సందర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని రైతులకు భరోసా ఇచ్చారు. ప్రతి సీజన్లో 6 వేల క్వింటాళ్లకు పై చిలుకు ధాన్యం దిగుబడి వచ్చే ఈ గ్రామంలో ఈసారి ఒక్క గింజ చేతికి వచ్చే పరిస్థితి లేదు. ప్రకృతి విలయానికి తల్లడిల్లిన ఈ గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వంగిన వరిగడ్డి, రాలిన కంకి గొలుసులే కనిపిస్తున్నాయి. ఇంకో 8 నెలల వరకు మళ్లీ పంటలు చూసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.