ఇల్లంతకుంట, ఫిబ్రవరి 25 : రంగనాయకసాగర్ ఆర్డీ3 ఎల్ఎం 6 కెనాల్ నిర్మాణం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పన్నెండు గ్రామాల రైతులు వినూత్న నిరసన తెలిపారు. పెద్దలింగాపూర్ శివారులో 16 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో బుధవారం జిల్లా కేంద్రంతోపాటు ఇల్లంతకుంటలో భిక్షాటన చేశారు. రైతుల కాలువకు నిధులు ఇవ్వలేని కాంగ్రెస్ సర్కార్ను దానం చేసి ఆదుకోండి అంటూ ప్రజలను వేడుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాలువ నిర్మాణం కోసం నిరుడు రూ.3.20 కోట్లు మంజూరు చేయించానని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్త మాటలే చెప్పారని విమర్శించారు. నిధులు వస్తే ఇప్పటివరకు పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రైతులను శాంతింప చేయడం కోసం ఎమ్మెల్యే ఆడిన నాటకమని ఎద్దేవా చేశారు. కనీసం 1.5 కిలోమీటర్ల కాలువ కూడా తవ్వలేని దుస్థితితో సర్కార్ ఉన్నదని దుయ్యబట్టారు. కాలువ పూర్తయితే ఇల్లంతకుంట మండలంలోని 4 గ్రామాలు, తంగళ్లపల్లి మండలంలోని 8 గ్రామాలకు చెందిన 10 వేల ఎకరాలు పూర్తిగా సస్యశ్యామలం అవుతాయని తెలిపారు.