నమస్తేతెలంగాణ న్యూస్నెట్వర్క్, జనవరి 2: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో పలు పథకాలకు దరఖాస్తు చేసుకునే విధానంపై స్పష్టత లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు విధివిధానాలు తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుబంధు రైతులకా? కౌలు రైతులకా? అని పలువురు రైతులు మంగళవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో రైతులు ఆర్ బుచ్చిరెడ్డి, నంబూరి మధు తదితరులు తమ సందేహాలను అధికారుల ముందు వ్యక్తంచేశారు. కాగా మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో సిబ్బంది కొరత, దరఖాస్తు ఫారాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ 24 కౌంటర్లకు గాను 17 మాత్రమే ఏర్పాటు చేశారు. వీటిలో కూడా సిబ్బంది కొరత కారణంగా 4 కౌంటర్లను ఖాళీగా వదిలేశారు. సిబ్బంది కొరత ఉన్నదని, దరఖాస్తు ఫారాలు వచ్చిన కాడికి ఇచ్చామని తహసీల్దార్ తోట సూర్యనారాయణ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో నిర్వహించిన గ్రామసభలో ప్రోటోకాల్ ఉల్లంఘన చోటుచేసుకోగా.. బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కమ్మర్పల్లిలో గ్రామసభ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఫొటో లేకపోవడంతో ఎంపీటీసీ మైలారం సుధాకర్, బీఆర్ఎస్ నాయకుడు లోలపు సుమన్, గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఫొటోలు ఏర్పాటుచేయాలని, ఆ తరువాతే సభ నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో దిగివచ్చిన అధికారులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్సీతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపూర్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాతో రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ప్రజాపాలనలో భాగంగా మంగళవారం నిర్వహించిన అభయహస్తం కార్యక్రమం కింద 20.39 లక్షల దరఖాస్తులను స్వీకరించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ప్రజాపాలన నిర్వహణపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. నాలుగో రోజైన మంగళవారం మొత్తం 20,39,927 దరఖాస్తులు స్వీకరించగా, వీటిలో అభయహస్తం గ్యారెంటీలకు సంబంధించి 17,39,146 దరఖాస్తులు రాగా, ఇతర అంశాలకు సంబంధించి 3,00,817 వచ్చాయని సీఎస్ వెల్లడించారు. ఇప్పటివరకు 61,16,167 దరఖాస్తులు అందినట్టు ఆమె పేర్కొన్నారు. మంగళవారం 1,866 మున్సిపల్ వార్డులు, 3,779 గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలిపారు.