మెట్పల్లి, ఫిబ్రవరి 15 : చెరుకు నరికివేతకు కూలీలను పంపించకుండా కాలయాపన చేస్తున్న గాయత్రీ చక్కెర ఫ్యాక్టరీ యాజమా న్యం తీరుపై రైతులు భగ్గుమన్నారు. గురువా రం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని గా యత్రీ చక్కెర ఫ్యాక్టరీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. మల్లాపూర్ మండలం రాఘవపేటకు చెందిన పలువురు రైతులు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ సమీపంలోని గాయత్రీ చక్కెర ఫ్యాక్టరీ ప్రతినిధులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సుమారు 22 ఎకరాల్లో చెరుకు సాగుచేశారు. పంట చేతికి వచ్చింది.
క్రషింగ్ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా తమ చెరుకును కట్ చేసి ఫ్యాక్టరీకి తరలించే ప్రక్రియలో కాలయాపన జరుగుతుండటంపై సాగు రైతుల్లో ఆందోళన వ్యక్తమైం ది. ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రక్రియ మరికొద్ది రోజు లే ఉండటంతో తమ చెరుకు పరిస్థితి ఏంటనే ఆవేదనలో ఉన్నారు. తమతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చెరుకు కోతలకు కార్మికులను పంపించకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నదని, తక్షణమే చెరుకు కోతలకు కూలీలను పంపించాలని డిమాండ్ చేస్తూ సంబంధిత ఫ్యాక్టరీకి సంబంధించిన కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.