జనగామ జిల్లా కొడకండ్ల మార్కెట్ ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రానికి రైతు పల్లె కిరణ్ గత నెల 22న ధాన్యాన్ని తీసుకొచ్చాడు. 21 రోజులవుతున్నా నేటికీ కాంటా పెట్టలేదు. అకాల వర్షాలు, ఎండల తీవ్రతకు ధాన్యం దెబ్బతింటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లోపాయికారీ ఒప్పందాలతో టోకెన్లు లేనివారి ధాన్యాన్ని నిర్వాహకులు కాంటా పెడుతుండడంతో కిరణ్ బుధవారం పెట్రోల్ డబ్బాతో కేంద్రానికి వచ్చాడు. ధాన్యాన్ని తగులబెడతానని హెచ్చరించాడు. వరుస క్రమంలో కాంటా పెట్టాలని డిమాండ్ చేశాడు. దీంతో సాయంత్రం కిరణ్ ధాన్యాన్ని కాంటా పెట్టారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేటలో బస్తాలు దించేవారు లేక ట్రాక్టర్లు, వ్యాన్లు రెండు రోజులుగా గోదాం దగ్గర క్యూ కట్టాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి రోజుకు 50 ట్రాక్టర్లు, నాలుగైదు డీసీఎంలలో ధాన్యం బస్తాలను రైతులు తీసుకొస్తున్నారు. హమాలీలు లేకపోవడంతో నాలుగు రోజుల నుంచి రైతులే బయట కూలీలను మాట్లాడుకుని ఒక్కో బస్తాకు రూ.6 నుంచి రూ. 8 చెల్లిస్తూ అన్లోడింగ్ చేయించుకుంటున్నారు.

హమాలీల కొరత ఉన్నదని, తూకం వేశాక మీరే అన్లోడ్ చేసుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మెలిక పెట్టడంతో రైతులు హమాలీలుగా మారారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని పలు గ్రామాల రైతులు రేచిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి వెళ్లి లారీలో నుంచి ధాన్యం బస్తాలను గోదాములోకి మోశారు.
– మంచిర్యాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి