హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతులకు వరం లాంటిదని, ఇంత గొప్ప పథకం ద్వారా లబ్ధిపొందుతున్న తెలంగాణ రైతులు అదృష్టవంతులని జాతీయ రైతు ఉద్యమ నేత, బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్సింగ్ కొనియాడారు. రాష్ట్రంలో 10వ విడత రైతుబంధు పంపిణీ చేస్తున్న సందర్భంగా రైతుబంధుపై తన అభిప్రాయాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
రైతుబంధు రైతులకు వరం లాంటిది. పెట్టుబడి కష్టాలను తీర్చడంతోపాటు రైతుల జీవితాలను మార్చేసింది. దేశంలో ప్రతి రైతూ పంట పెట్టుబడి కోసం కష్టాలు పడుతున్నవాడే. వారిని ఆదుకోవాలని ఎన్నో ఏండ్లుగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఏ ప్రభుత్వం కూడా రైతుల కష్టాలను తీర్చే దిశగా పని చేయలేదు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలనే ఆలోచన ఎవరికీ రాలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్కు అంతటి గొప్ప ఆలోచన వచ్చింది. ఇందుకు రైతు ఉద్యమ నేతగా రైతుల పక్షాన సీఎంకు కృతజ్ఞతలు. కేసీఆర్ దేశ వ్యవసాయరంగానికి సరికొత్త దారి చూపించారు.
రైతుబంధు పథకం ప్రభుత్వానికి ఆర్థికంగా భారమే. అయినప్పటికీ, సీఎం కేసీఆర్ రైతుల కోసం కృతనిశ్చయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతుబంధు ద్వారా మొత్తంగా రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం మామూలు విషయం కాదు. ఇంత భారీ మొత్తంలో నేరుగా రైతులకు నగదు ఇచ్చిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. కేసీఆర్ తప్ప మరే ముఖ్యమంత్రి కూడా రైతుల కోసం ఇంత పెద్ద సాహసం చేయలేదు. ఈ ఒక్క పథకంతో తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని నిరూపించింది.
రైతులు ఎదుర్కొంటున్న ఏయే సమస్యలపై మేం జాతీయ ఉద్యమం చేశామో.. ఆ సమస్యలన్నీ తెలంగాణలో పరిష్కారమయ్యాయి. ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, పుష్కలమైన సాగునీరు, మద్దతు ధరకు పంటల కొనుగోలు, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ ఇలా ఏ అంశంలోనైనా ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ రైతులు అదృష్టవంతులు. ఇలాంటి పథకాలు దేశంలోని ప్రతిరైతుకూ అందాలనే ఉద్దేశంతో దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. తెలంగాణ మాడల్ను దేశానికి పరిచయం చేయబోతున్నాం.