లింగాలఘనపురం, మే 17: ధాన్యం కాంటా కాకపోవడంతో ఆవేదన చెందిన రైతు, కాంగ్రెస్ కార్యకర్త ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం ఏనెబావిలో జరిగింది. కాంగ్రెస్ నాయకుడు పొన్నాల తిరుమలేశ్ 25 రోజుల క్రితం 200 బస్తాలకు పైగా ధాన్యాన్ని ఏనెబావి కొనుగోలు కేంద్రానికి తరలించాడు. కాంటాలో జాప్యంతోపాటు లారీలు రావడంలేదని ఆదివారం ఆవేదన వ్యక్తం చేశాడు. రైతులే ట్రాక్టర్ల ద్వారా మిల్లుకు తరలించేందుకు అయ్యే రూ.3 వేలు భరించాల్సింటుందని అధికారులు చెప్తున్నారని వాపోయాడు.
ధాన్యాన్ని మిల్లుకు తరలించేందుకు ఖర్చును కాంట్రాక్టర్ భరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. ధాన్యం కాంటా కాకపోవడంపై సర్కార్ తీరును నిరసిస్తూ తిరుమలేశ్ ఒంటిపై డీజిల్ చల్లుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన రైతులు అతడిని అడ్డుకున్నారు. సర్కార్ నిర్లక్ష్యంతోనే కొనుగోళ్లు జరుగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.