పెనుబల్లి, మే 13 : ధాన్యం ప్రైవేట్గా విక్రయించిన విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్లపెంటలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు దవళం వెంకటేశ్ (42) నాలుగెకరాల భూమిలో వరి సాగు చేశాడు. చేతికొచ్చిన పంటను ఆరబెట్టాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొంటారో లేదోననే ఆందోళనతో బయట దళారులకు విక్రయించాడు. దళారులకు పంట ఎందుకు విక్రయించావని వెంకటేశ్ భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది.
తీవ్ర మనస్తాపం చెందిన వెంకటేశ్ ఈ నెల 11న ఇంట్లో గడ్డిమందు తాగి స్పృహ కోల్పోయి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు కల్లూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్ మంగళవారం రాత్రి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వీఎం బంజర ఎస్సై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.