ములుగు, జూలై 20 (నమస్తేతెలంగాణ) : పోడు భూమిలో ఫారెస్టు అధికారులు కందకాలు తీస్తుండటంతో మనస్తాపంచెందిన రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. బాధిత పోడురైతు బోడ మహేందర్ భార్య రమ తెలిపిన వివరాల ప్రకారం.. బోడ మహేందర్ 12 ఏండ్లుగా పాలంపేట శివారులోని రామప్ప సరస్సును ఆనుకొని ఉన్న భూమిలో పోడు వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల కొందరు కాంగ్రెస్ నాయకులు 20 రోజుల నుంచి ఇబ్బందులకు గురిచేస్తూ ఫారెస్టు అధికారులతో దాడులు చేయిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన మహేందర్ సెల్ఫీ వీడియో తీసి అధికారుల ఎదుటే పురుగు మందు తాగాడు. సాగు చేసుకుంటున్న భూమిలో ట్రెంచ్ వేస్తే పొలంలోనే మందుతాగి చచ్చిపోతానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ భూమినే జీవనాధారమని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మహేందర్ ములుగు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు.