హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ప్రముఖ చిత్రకారుడు గోపి (లూసగాని గోపాల్గౌడ్) కరోనా బారినపడి మృతిచెందారు. ఆయన వయసు 69 ఏండ్లు. గోపి భౌతికకాయానికి ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్లోని మహాప్రస్థానంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. తెలంగాణ పల్లె సంస్కృతిని ఒడిసి పట్టుకున్న గోపి స్వస్థలం పాలమూరు జిల్లా కల్లాపూర్ సమీపంలోని ఎనమెట్ల. బాపు మెచ్చిన గొప్ప చిత్రకారుడు ఆయన. చంద్ర, మోహన్, బాలి తరానికి చెందిన గోపిది విలక్షణ శైలి. 1975లో జేఎన్టీయూలో ఫైన్ఆర్ట్స్ చదివిన ఆయన.. నాలుగు దశాబ్దాలపాటు ఇల్లస్ట్రేటర్గా, పెయింటర్గా, కార్టూనిస్ట్గా అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. సుదీర్ఘకాలం స్వాతి వారపత్రికకు కార్టూన్లు గీశారు. మా భూమి, రంగుల కల, దొంగల దోపిడి సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్గా పనిచేశారు. ఉదయం, వార్త, ఆంధ్రభూమి దినపత్రికలకు మాస్ట్హెడ్ (టైటిల్)కు రూపకల్పన చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ పథకాల ప్రచారానికి అనేక పోస్టర్లకు డిజైన్ చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం భాషా, సాంస్కృతికశాఖ గోపిని గౌరవించి, గొప్పగా సన్మానించింది.
చిత్రకారుడు గోపి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. నాలుగు దశాబ్దాలపాటు ఇల్లస్ట్రేటర్గా కార్టూనిస్ట్గా తన కుంచెతో అద్భుత చిత్రాలు వేసిన గోపి మరణంతో తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు. గోపి కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.