హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఫ్యామిలీ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ పెన్షన్ల అమలుపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ను వర్తింపజేస్తూ జీవో- 58ని గతంలోనే జారీచేసింది. అయితే అప్పట్లో మార్గదర్శకాలను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే సీపీఎస్ యూనియన్ నేతలు మార్గదర్శకాలను విడుదల చేయాలని కోరుతూ పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. ఈ వినతులను ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ పరిగణనలోకి తీసుకున్నది. చనిపోయిన ఉద్యోగి, ప్రాన్ కార్డు లేనివారు, సీపీఎస్ రికవరీ లేనివారు, ఫ్యామిలీ పెన్షన్ ఉత్తర్వులు రాకముందే ప్రాన్ నుంచి ఎగ్జిట్ అయినవారి విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. ఉద్యోగి కుటుంబం ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి? ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏం చేయాలో సూచిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ వర్తింపజేసేందుకు మార్గదర్శకాలు జారీచేయడం పట్ల సీపీఎస్ యూనియన్ నేతలు సీఎం కేసీఆర్కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసిన ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కేఎస్ఆర్సీ మూర్తికి సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, కల్వల శ్రీకాంత్, నరేశ్, నరేందర్రావు, కోటకొండ పవన్, మ్యాన పవన్కుమార్, సత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్తర్వుల వల్ల ప్రస్తుతానికి రాష్ట్రంలోని 1,500 పైచిలుకు ఉద్యోగుల కుటుంబాలు ఫ్యామిలీ పెన్షన్ ప్రయోజనం పొందుతాయని వారు ఆశాభావం వ్యక్తంచేశారు.
ఫ్యామిలీ పెన్షన్ అమలు ఇలా..
ఉద్యోగి చనిపోతే.. ప్రాన్ అకౌంట్ ఉండి, సీపీఎస్ అమౌంట్ అకౌంట్స్లో లేని పక్షంలో డ్రాయింగ్ అధికారి నిర్ణయం తీసుకుని, ట్రెజరీ అధికారికి నివేదిక పంపిస్తే ఆయా ఉద్యోగికి ఫ్యామిలీ పెన్షన్ వర్తింపజేస్తారు.
ప్రాన్ అకౌంట్స్లో సీపీఎస్ అమౌంట్ పాక్షికంగా జమ అయిన మిగతా మొత్తం జమకాని పక్షంలో డ్రాయింగ్ అధికారి వద్ద నుంచి నిర్దేషిత ప్రొఫార్మాలో అంగీకారంతో ప్రాన్ అకౌంట్స్లో ఉన్న మొత్తాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తూ అండర్టేకింగ్ సమర్పిస్తే పెన్షన్ మంజూరు చేస్తారు.
ప్రాన్ అకౌంట్ లేకుండా.. ఉద్యోగి చనిపోయినా, ఫ్యామిలీ పెన్షన్ ఉత్తర్వులు రాక ముందే ప్రాన్ నుంచి వైదొలిగినవారికి సైతం ఫ్యామిలీ పెన్షన్ వర్తింపజేస్తారు.
ఉద్యోగి ఏడేండ్లపాటు తప్పిపోతే పాత పెన్షన్ రూల్స్ ప్రకారం చనిపోయినట్టు నిర్ధారించుకొని ఫ్యామిలీ పెన్షన్ ఇస్తున్నారు. అయితే సీపీఎస్ ఉద్యోగులను విషయంలో రాష్ట్ర సీపీఎస్ నోడల్ అధికారి ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.