కేటీదొడ్డి, జూన్ 20: జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం స్టేజీ, ఉమిత్యాల గ్రామంలో ఓ నకిలీ స్వామి మోసాలకు పాల్పడుతున్నాడు. తన చుట్టూ గోవిందా.. గోవిందా అని తిరిగితే.. పక్షవాతం తగ్గుతుందని, మూగవారికి మాటలు వస్తాయని, చెవిటివారికి వినబడుతుందని ప్రజలను నమ్మించాడు. నిజమే అనుకున్న అమాయక ప్రజలు.. చుట్టు పక్కల గ్రామాలు, కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫలితంగా ఇక్కడ తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు స్వామిని అరెస్టు చేసి, కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.
స్వామి.. తన ఇద్దరు భార్యలు, కొడుకుతో కలిసి మండలం వదిలి వెళ్లాడు. ఆ తర్వాత స్వామి మాటలు నమ్మశక్యంగా లేవని, దొంగస్వామి అని సోషల్ మీడియాలో రెండ్రోజులుగా వైరల్ అవుతున్నది. నకిలీ స్వామిగా వైరల్ అవుతున్న వ్యక్తి చెన్నైకి చెందిన సంతోష్ అని, అతడు పెబ్బేరు మండలం సూగూరు గ్రామంలో పూజారిగా పనిచేస్తున్నట్టు సమాచారం.