నాసిరకం విత్తనాలతో జర జాగ్రత్త
గ్రామాల్లోకి వచ్చి అమ్ముతున్న కేటుగాళ్లు
వరి, పత్తి రైతులే టార్గెట్గా అక్రమ దందా
మహారాష్ట్ర నుంచి నిషేధిత విత్తనాలు
అడ్డుకొనేందుకు సర్కారు అన్ని చర్యలు
గుర్తింపు పొందిన డీలర్ వద్దే కొనాలి
రశీదు, సంచులు భద్రపరచాలి: అధికారులు
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): పంట ఏదైనా నాణ్యమైన విత్తనం ముఖ్యం. విత్తనం బాగుంటేనే పంట దిగుబడి బాగా వచ్చి, రైతుకు నాలుగు పైసలు మిగులుతాయి. త్వరలో వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున విత్తనాల కొనుగోలులో రైతులు అత్యంత జాగ్రత్తగా వ్యహరించాల్సిన అవసరం ఉన్నదని అధికారులు సూచిస్తున్నారు. నకిలీ విత్తనాల బారిన పడకుండా నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని చెప్తున్నారు. నకిలీ విత్తనాలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం వ్యవసాయ, పోలీస్ అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.
పత్తిపై కేటుగాళ్ల ఫోకస్
రాష్ట్రంలోఅధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి, పత్తి, సోయాబీన్ విత్తనాలపై కేటుగాళ్లు ఫోకస్ పెట్టారు. ఈ సీజన్లో భారీ విస్తీర్ణంలో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నందున, దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. నిషేధిత హెచ్టీ (హెర్బిసైడ్ టోలరెంట్) కాటన్ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఈ విత్తనాలను తీసుకొచ్చి ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. గత ఏడాది అధికారులు చేసిన దాడుల్లో 182 శాంపిల్స్ను హెచ్టీ కాటన్గా గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 18 శాంపిల్స్ను పట్టుకొన్నారు.
నకిలీపై ప్రభుత్వం ఉక్కుపాదం
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నది. సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ, పోలీస్ అధికారులతో సంయుక్తంగా టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 34 మందిని అరెస్ట్ చేసి, 21 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రూ.1.16 కోట్ల విలువైన 315 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. గత ఏడాది 551 మందిని అరెస్ట్ చేసి ఏకంగా 347 క్రిమినల్ కేసులు పెట్టారు. ఇందులో 16 పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయి.
రైతులూ.. ఈ జాగ్రత్తలు పాటించండి
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు
రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నాం. ఇప్పటికే జిల్లాలవారీగా, రాష్ట్రస్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఈ సీజన్లో ఇప్పటికే 34 మందిని అరెస్ట్ చేసి 21 క్రిమినల్ కేసులు నమోదు చేశాం. వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో ప్రత్యేక నిఘా పెట్టింది. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి.
– రఘునందన్రావు, కార్యదర్శి, వ్యవసాయ శాఖ