మేడ్చల్/హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నకిలీ విత్తన ముఠాలపై వ్యవసాయశాఖ, టాస్క్ఫోర్స్ బృందాలు ఉక్కుపా దం మోపుతున్నాయి. తాజాగా, నకిలీ విత్తనాలు వి క్రయిస్తూ రైతన్నలను నిలువు దోపిడీ చేసేందుకు య త్నిస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాల గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో ఏ డుగురికి అరెస్టు చేసి, వారి వద్ద రూ.85 లక్షల విలువైన 2.65 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసు వివరాలు వెల్లడించారు. 25న కర్ణాటకలోని పుత్పాక్ నుంచి బాచుపల్లి, బాలానగర్ శివారు ప్రాంతాలకు నకిలీ విత్తనాలను తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ బృందాలు పట్టుకొన్నాయి. నిషేధిత బీజీ-3/హెచ్టీ పత్తి విత్తనాలతో కూడిన 24 బ్యాగులు (1.4 టన్నులు), 2,200 నకి లీ బ్రాండెడ్ విత్తనాల సంచులు, బొలెరో వాహనం, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నాయి. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో షాబాద్లో విక్రయిస్తున్న నకిలీ విత్తనాలనూ పట్టుకొన్నారు. వికారాబాద్లోని దౌల్తాబాద్ నుంచి 220 సంచుల్లో 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలను కారులో తరలిస్తుండగా చందన్వెల్లి వద్ద పట్టుబడ్డాయి.
ముఠాల ఆటకట్టించేందుకు ప్రత్యేక బృందాలు
యాసంగిలో నకిలీ విత్తన ముఠాలను అరికట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం.. గోడౌన్లు, రవాణాపై అధికారులు నిఘా పెట్టారు. హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. విత్తనాలు కొన్న తర్వాత కచ్చితంగా బిల్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.
10 క్వింటాళ్ల నకిలీ విత్తనాల పట్టివేత
వికారాబాద్ పట్టణంలో టాస్క్ఫోర్స్ 10 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. వికారాబాద్లో కేసు వివరాలను ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సీఐ వెంకటేశం, పట్టణ సీఐ శ్రీను, పోలీస్, టాస్క్ఫోర్స్ సిబ్బంది ఉదయం 5 గంటల సమయంలో పట్టణంలోని ఎన్నెపల్లి చౌరస్తాలో తనిఖీ చేశారు. అక్కడ రెం డు బ్యాగులతో అనుమానాస్పదంగా తిరుగుతు న్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా.. అతని వద్ద 25 కిలోల నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు లభించాయి. అతడిని విచారించి మరో 9.75 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్కు చెందిన జాగర్లమూడి శ్రీనివాస్రావుగా గుర్తించారు.
90 శాతం బెడద తగ్గింది
నకిలీ విత్తన ముఠాల చైన్ను తెగ్గొట్టి, ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ పోలీస్ శాఖను సూచిస్తున్నారు. ఈ క్రమం లో వ్యవసాయశాఖ అధికారుల సమన్వయంతో నకిలీ విత్తనదారులపై ఉక్కుపాదం మోపుతు న్నాం. సీఎం, రాష్ట్ర ప్రభుత్వ చర్యల ఫలితంగా రాష్ట్రంలో 80-90 శాతం వరకు నకిలీ విత్తనాల బెడద తగ్గింది. అక్కడక్కడ ఉన్న మాఫియాను ఏరిపారేస్తున్నాం. దేశంలో ఎక్కడాలేనివిధంగా మన రాష్ట్రంలోనే నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నాం.
– సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర