కోనరావుపేట, జూన్ 12: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో నకిలీ పాస్బుక్ల గుట్టురట్టయింది. వీటిని తయారు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కాశీరామ్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేసేవాడు.
గ్రామానికి చెందిన దండుగుల కనుకయ్యకు ప్రభుత్వ భూమి పట్టా చేస్తానని నమ్మించి 3 ఎకరాల పట్టా పాస్పుస్తకం తయారు చేసి రూ. లక్ష వసూలు చేశాడు. అతడి భార్య దండుగుల పోశవ్వ పేరు మీద గ్రామ శివారు సర్వే నంబర్ 367లో 3 ఎకరాల భూమి ఉన్నట్టుగా నకిలీ పాస్పుస్తకం తయారు చేసి ఇచ్చాడు. కాశీరామ్.. కనుకయ్యకు రెండేండ్ల క్రితం చూపించిన భూమిలో వారం క్రితం సాగుచేస్తుండగా అటవీ అధికారులు అడ్డుకున్నారు.
దీంతో కనుకయ్య కాశీరామ్కు విషయం చెప్పగా తనకు సంబంధం లేదని దాటవేశాడు. డబ్బు లు అడిగితే చంపేస్తానని బెదిరించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలో మార్పు లు చేస్తున్నారని నమ్మించాడు. మరో రూ.20 వేలు ఇస్తే ధరణిలో నమోదు చేయిస్తానని నమ్మబలికాడు. ఇలా పలువురికి నకిలీ పట్టా పాస్బుక్లు తయారు చేసి ఇచ్చి డబ్బులు దండుకున్నాడు. బాధితుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్సై ఆంజనేయులు బుధవారం కాశీరామ్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతుల పట్టాదారు పాస్బుక్లు 10, టైటిల్ డీడీ ఆరు పుస్తకాలు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.