హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి తగ్గి, వేసవి సెలవులు మొదలుకానుండటంతో తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కంపార్ట్మెంట్లు, క్యూలైన్లు, షెడ్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రద్దు చేసిన వీఐపీ బ్రేక్ దర్శనాలను సోమవారం నుంచి తిరిగి ప్రారంభించామని వెల్లడించారు. భక్తులు ఎలాంటి సంకోచం లేకుండా శ్రీవారి దర్శనానికి రావచ్చని సూచించారు.