హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): బీజేపీలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి, ఎమ్మెల్యే ఈటలకు మధ్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరినట్టు ఆ పార్టీ నేతలే చర్చించుకొంటున్నారు. బీజేపీకి తానొక్కడినే పెద్ద దిక్కుగా ఉండాలని బండి సంజయ్ భావిస్తుండగా, ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో ఈటల రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారని ఓ వర్గం ప్రచారం చేస్తున్నది. దీంతో ఈటల ఎదగకుండా బండి ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీలో చర్చించుకొంటున్నారు.
కీలక సమావేశాలకు ఈటలకు సరిగా ఆహ్వానం పంపకపోవడం, ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కకు పెడుతున్నట్టు తెలుస్తున్నది. చేరికల కమిటీ చైర్మన్గా ఈటల విఫలం అయ్యారని నిరూపించేందుకు బండి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈటల రాజేందర్లో అసహనం కట్టలు తెంచుకొంటున్నది. బీజేపీ పెద్దలు ఏరి కోరి చేరికల కమిటీ చైర్మన్ పదవిని ఈటలకు కట్టబెట్టారు. అయితే, కొన్ని నెలలుగా బీజేపీలో ఒక్కరు చేరితే, నలుగురు బయటికి వెళ్లిపోతున్నారు. దీంతో పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
ఈటలతోపాటు బీజేపీలో ఇటీవల చేరిన కొండా విశ్వేశ్వర్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలాంటి నేతలు కూడా ఇలాంటి అవమానాలే ఎదుర్కొంటున్నారు. వారంతా బండి సంజయ్పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. అందరూ కలిసి ఒకేసారి వేరే పార్టీలోకి వెళ్లడం లేదా ఢిల్లీకి వెళ్లి బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని, లేదంటే తమ దారి తాము చూసుకుంటామని అధిష్టానానికి డెడ్లైన్ పెట్టే అవకాశం ఉన్నదని పార్టీలో జోరుగా చర్చ సాగుతున్నది.