హైదరాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): అటవీ వ్యవసాయంపై సంయుక్తంగా విస్తృత పరిశోధనలు చేపట్టాలని వ్యవసాయ, అటవీ విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి. ఈ మేరకు అటవీ వ్యవసాయం, జీవవైవిధ్య సంరక్షణపై కలిసి పనిచేసేందుకు దూలపల్లిలోని అటవీ, సహజ వనరుల నిర్వహణ అధ్యయన కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎం వెంకటరమణ, అటవీ అకాడమీ సంచాలకులు డాక్టర్ ఎస్జే ఆశా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సంచాలకులు డాక్టర్ జమునారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, అటవీ, వ్యవసాయ విభాగం శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.