నల్లగొండ : నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన వాహనంలో దవాఖానకు తరలించి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ప్రమాదాల్లో గాయపడి సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి ఆపన్న హస్తం అందివ్వాలని తన చేతల ద్వారా చాటి చెప్పారు.
వివరాల్లోకెళితే.. నల్లగొండ పట్టణంలో అధికారిక కార్యక్రమాలను ముగించుకొని నార్కట్పల్లి వైపు వెళ్తుండగా మార్గమధ్యలో అన్నపర్తి బెటాలియన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఇదే రోడ్డు గుండా వెళ్తున్న ఎమ్మెల్యే లింగయ్య.. తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న యువకులను చూసి తన వాహనాన్ని వెంటనే నిలిపేశారు. తన కారులో ఉన్న కిట్ ద్వారా వారికి ప్రథమ చికిత్స అందించి, తన వాహనంలోనే వారిని నార్కట్పల్లిలోని కామినేని దవాఖానకు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి విజ్ఞప్తిచేశారు. గాయపడిన వారికి వైద్యపరమైన సేవలను దగ్గరుండి చూసుకోవాలని తన కార్యాలయ సిబ్బందికి ఆదేశించారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన సహాయానికి నకిరేకల్ పట్టణానికి చెందిన వారు హర్షం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన వాహనాన్ని వారికి ఇచ్చి నకిరేకల్ దవాఖానకు పంపడం ఆయన మంచితనానికి నిదర్శనమని కొనియాడారు. ఎమ్మెల్యే లింగయ్య మాదిరిగానే ప్రజలు కూడా ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ ఆపన్న హస్తం అందిస్తే ఎంతో మందిని బతికించిన వారం అవుతాం.