NEET | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): వైద్య విద్యకు సంబంధించి రాష్ర్టాల అధికారాలను కబళించి తన గుప్పిట్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనవసర జాప్యంతో విద్యార్థులను అయోమయంలోకి నెట్టేస్తున్నది. గతంలో మెడికల్ సీట్లకు ఆయా రాష్ర్టాలే ఎంసెట్ తరహా ప్రవేశపరీక్షలు నిర్వహించేవి. ఇప్పుడు దాని స్థానంలో ‘నీట్’ను తీసుకొచ్చిన కేంద్రం క్రమంగా పిడికిలి బిగిస్తున్నది. ఇప్పుడు కౌన్సెలింగ్ను కూడా తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. నీట్ ఫలితాలు విడుదలై ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కౌన్సెలింగ్ ఊసెత్తకపోవడం ఇందుకు నిదర్శనం. ఎంబీబీఎస్ సీట్లకు ఈ ఏడాది దేశవ్యాప్తంగా ‘కామన్ కౌన్సెలింగ్’ నిర్వహిస్తామంటూ వింత ప్రతిపాదన తీసుకొచ్చి గెజిట్ కూడా విడుదల చేసింది.
ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లోని 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు కేంద్రం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నది. మిగతా 85 శాతం సీట్లకు రాష్ర్టాల మెడికల్ యూనివర్సిటీలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి. రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ద్వారా కౌన్సెలింగ్ జరుగుతుంది. అయితే, రాష్ర్టాల కౌన్సెలింగ్తో ప్రైవేట్ కాలేజీల్లో సీట్లను బ్లాక్ చేస్తూ అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఎన్ఎంసీ వాదిస్తున్నది. కోర్టు మార్గదర్శకాల మేరకు కామన్ కౌన్సెలింగ్ విధానాన్ని తీసుకొస్తున్నామంటూ కేంద్ర వైద్యారోగ్యశాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) చెబుతున్నది. అయితే, ఎన్ఎంసీ వాదనలో పసలేదని, దేశంలోని భిన్న రిజర్వేషన్ల వ్యవస్థల కారణంగా దీనిని అమలు చేయడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
కన్వీనర్ కోటాలో అక్రమాలు అసాధ్యం
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉద్దేశపూర్వకంగా సీట్లను బ్లాక్ చేసి, వాటిని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారంటూ ఎన్ఎంసీ చెప్తున్నది. వాస్తవానికి కన్వీనర్ కోటాలో సీట్లను బ్లాక్ చేసే అవకాశమే లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం మేనేజ్మెంట్ కోటాలోనే ఇలాంటి అవకాశం ఉంటుందని తెలిపారు. కావాలనుకుంటే దానికి ఆలిండియా కోటా మాదిరిగా కామన్ కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని సూచిస్తున్నారు.
చేసేది 10 శాతం పనే
కామన్ కౌన్సెలింగ్ అని కేంద్రం గొప్పగా చెప్పుకుంటున్నా.. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఇది 10 శాతం పని మాత్రమేనన్నది నిపుణుల మాట. కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు పోర్టల్లో అప్లోడ్ చేసే వివరాల ఆధారంగా ఎంసీసీ సీట్లను కేటాయిస్తుంది. అక్కడితో తన బాధ్యత పూర్తవుతుంది. అడ్మిషన్ ప్రక్రియ, సర్టిఫికెట్ల పరిశీలన వంటి కీలక బాధ్యతలను కాలేజీల ప్రిన్సిపాళ్లకు వదిలేసింది. మొత్తం ప్రక్రియలో అసలు పనిని వదిలేసి, పేరుకే కేంద్రం పెత్తనం తీసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
కామన్ కౌన్సెలింగ్లో అనేక అవాంతరాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు పోర్టల్లో అప్లోడ్ చేసే వివరాల ఆధారంగా మెడికల కౌన్సెలింగ్ కమిటీ సీట్లను కేటాయిస్తుంది. అయితే..
రాష్ట్రలు వ్యతిరేకిస్తున్నా
కామన్ కౌన్సెలింగ్ను దేశవ్యాప్తంగా బీజేపీయేతర రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు ఏకంగా కేంద్రానికి లేఖ రాసింది. కామన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే తాము నీట్నే ఎదురిస్తామని హెచ్చరించింది. దీంతో ఈ ఏడాది తమిళనాడును మినహాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి తెలిపారు.
వాస్తవానికి దేశవ్యాప్తంగా కామన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘రాష్ర్టాల్లో కామన్ కౌన్సెలింగ్’ నిర్వహించాలని మాత్రమే సూచించిందని చెబుతున్నారు. ఆలిండియా కోటా సీట్లను సీడీహెచ్ఎస్ ద్వారా భర్తీ చేయాలని, డీమ్డ్ యూనివర్సిటీలు, ఇతర మత సంస్థల విద్యాసంస్థలు సైతం ఈ పరిధిలోకి వస్తాయని కోర్టు పేర్కొన్నదని తెలిపారు. మిగతా సీట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ‘కామన్ కౌన్సెలింగ్’ నిర్వహించాలని సూచించిందని వివరించారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలతోపాటు డీమ్డ్ యూనివర్సిటీలు, మత సంస్థల ఆధ్వర్యంలో విద్యాసంస్థలు ఉంటాయని స్పష్టంగా చెప్పిందని, ఇదే విషయం ఎన్ఎంసీ చట్ట సవరణ 2017లోని 5ఏ నిబంధనలో పొందుపరిచిందని కూడా వివరించారు. కేంద్రం దీనిని వక్రీకరించి రాష్ర్టాల హక్కును హరించేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడుతున్నారు.