నిర్మల్ : పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ నుంచి బంగల్ పేట్ వరకు రూ. 5 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నగరేశ్వర్ వాడ చౌరస్తా శిలాపలకాన్ని ఆవిష్కరించి పనులు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం ఏర్పడిన తరువాత నిర్మల్ పట్టణంలో జనాభా బాగా పెరిగిందన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న రోడ్డు వెడల్పు పనులు పట్టణ ప్రజల సహకారంతో పూర్తి చేశామన్నారు.
రోడ్డు వెడల్పుతో ఇరుకు రోడ్ల సమస్య తొలగి పోయిందని అన్నారు. చైన్గేట్ నుంచి బంగల్ పేట్ వరకు రోడ్డు విస్తరణలో ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారన్నారు. రూ.5 కోట్లతో బీటీ రోడ్డు పనులు పూర్తి చేసి ఇరువైపులా డ్రైనేజీ కాలువలు, LED లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయ, అదనపు కలెక్టర్ హేమంత్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, FSCS చైర్మన్ ధర్మజి రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, TRS నాయకులు తదితరులు పాల్గొన్నారు.