హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణం లెక్కింపుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నదో లెక్కలు తీయనున్నది. పంటల నమోదు ప్రక్రియను వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను అధికారులు రూపొందిస్తున్నారు. గత ఏడాది రైతులవారీగా చేయడంతోపాటు సర్వే నంబర్లవారీగా పంటల నమోదుకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నది. ఇందులో మరికొన్ని అంశాలను జోడించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. పంట విస్తీర్ణం నమోదుతోపాటు పంట ఏ దశలో ఉన్నది? ఏమైనా చీడపీడలు పట్టాయా? ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది? వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఒకవేళ పంటకు ఏమైనా చీడపీడలు పట్టినా, పట్టే అవకాశం ఉన్నా.. ఆ రైతులకు తగు జాగ్రత్తలు సూచించనున్నారు. పంటల నమోదులో భాగంగా ఏఈవోల కోసం ఇప్పటికే ప్రత్యేక యాప్ను ఆ శాఖ సిద్ధం చేసింది. యాప్ ద్వారా పొలం నుంచే పంటలను నమోదు చేసేలా చర్యలు తీసుకొన్నది.
శాటిలైట్ సర్వేపై కసరత్తు..
పంట సాగు విస్తీర్ణాన్ని పక్కాగా నమోదు చేసేందుకు అధికారులు కొత్త విధానాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే శాటిలైట్ సర్వేపై కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) శాస్త్రవేత్తలను కూడా సంప్రదించారు. పంటల నమోదుకు ఎన్ఆర్ఎస్సీ శాస్త్రవేత్తలు సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. వరి, మక్కజొన్న, కంది, పత్తి వంటి పంటలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. నూతన సాంకేతికత ద్వారా శాటిలైట్ సాయంతో ఆ పంటల నుంచి వచ్చే కాంతి కిరణాల ఆధారంగా ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైంది? పంట ఏ స్థాయిలో ఉన్నది? పంట కాలం ఎప్పుడు పూర్తవుతుంది? ఎంత దిగుబడి వస్తుంది? చీడపీడలు ఎలా ఉన్నాయి? వంటి అంశాలను పక్కాగా లెక్కించనున్నారు. ఇక ప్రస్తుతం సాగు పూర్తయ్యాక పంటల విస్తీర్ణాన్ని లెక్కిస్తున్నారు. దీని వల్ల ఎప్పుడు ఎంత ఎరువులు అవసరం వస్తాయి? ఏ పంటను కంట్రోల్ చేయోచ్చు? వంటి అంశాలపై స్పష్టత ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, బెంగాల్లో పంటల సాగు మొదలైనప్పటి నుంచే విస్తీర్ణాన్ని శాటిలైట్ టెక్నాలజీ ద్వారా లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైతే వచ్చే సీజన్లో రాష్ట్రంలోనూ ఆ తరహాలో పంట నమోదు విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.