Ganja Chocolates | మామిళ్లగూడెం, జనవరి 30: చాక్లెట్ల మాటున గంజాయిని తరలిస్తున్న ఓ ఇద్దరు మహారాష్ట్ర మహిళలను ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్-2 సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన ఇద్దరు మహిళలు ఇటీవల ఒడిశా వెళ్లారు. అక్కడి నుంచి ఏపీలోని చింతూరుకు చేరుకున్నారు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పకడ్బందీగా ప్యాక్ చేసిన 8 కిలోల గంజాయిని, చాక్లెట్లుగా మార్చిన మరో 3 కిలోల గంజాయి ప్యాకెట్లను తీసుకొని బస్సులో భద్రాచలం చేరుకున్నారు.
అక్కడి నుంచి మరో బస్సులో హైదరాబాద్కు బయలుదేరారు. సోమవారం రాత్రి ఆ బస్సు ఖమ్మం సరిహద్దులోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే.. సీఐ విజేందర్ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు ఆపి తనిఖీ చేయగా.. రాఖీ గణేశ్ చౌహాన్, బాలీ వసంత్ సూలంకే అనే ఇద్దరు మహిళల బ్యాగుల్లో గంజాయిని గుర్తించారు. టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. చాక్లెట్లుగా మార్చిన గంజాయి ప్యాకెట్లపై చార్మినార్ గోల్డ్ పేరుతో లోగో ఉన్నదన్నారు.