మహబూబ్నగర్, డిసెంబర్ 16 : మన్యంకొండ క్షేత్రాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ ఏడాది రూ.25 కోట్లు.. వచ్చే ఏడాది రూ.25 కోట్లు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావుతో కలిసి మన్యంకొండ, మినీ ట్యాంక్బండ్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి పవర్పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మన్యంకొండలో ఒకే బంతిలో వెయ్యి మంది భక్తులు కూర్చునేలా అన్నదానసత్రం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్ద హనుమాన్ విగ్రహం, అడ్వెంచరీ మ్యూజియం, కల్యాణకట్ట, స్టాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, టూరిజం హోటళ్లతోపాటు రోప్వేను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మినీ ట్యాంక్బండ్ వద్ద సస్పెన్షన్ బ్రిడ్జి, ఐలాండ్, నాలుగు నమూనా యుద్ధవిమానాలు, మౌంటెయిన్, ఓపెన్ థియేటర్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సందర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. హరితహోటల్ నిర్మాణానికి రూ.15 కోట్లను, కొండపైకి డబుల్ రోడ్డుకు రూ.3.5 కోట్లు, సదుపాయాలకు రూ.4 కోట్లు కేటాయించిట్టు మంత్రి తెలిపారు. పాలమూరులోని లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరైనట్టు వివరించారు.