రామడుగు, ఫిబ్రవరి 23: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్హౌస్లో బుధవారం రాత్రి 9.59 గంటలకు ప్రాజెక్టు అధికారులు ఎత్తిపోతలు ప్రారంభించారు. నాలుగో యూనిట్ (మోటర్) ద్వారా నీటిని విడుదల చేశారు. సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ వద్ద పంపులను ప్రారంభించగా, శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వను స్థిరంగా కొనసాగించేందుకు వీలుగా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది రిజర్వాయర్ నుంచి గేట్లను ఎత్తి లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్కు నీటిని తరలిస్తున్నారు. ఇక్కడి సర్జ్పూల్కు చేరిన జలాలు నాలుగో పంపు ద్వారా ఎత్తిపోస్తూ, గ్రావిటీ కాలువకు తరలించి, అక్కడి నుంచి వరద కాలువ ద్వారా ఎస్సారార్ జలాశయానికి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.