ఆదిలాబాద్ : ఇక నుంచి జిల్లా రైతులు రూపాయి ఖర్చు లేకుండా భూసార పరీక్షలు జరిపించుకోవచ్చు. 72 గంటలలో ఫలితాలు తెలుసుకోవచ్చని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన భూసార పరీక్షా కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో భూసార పరీక్షలకు జిల్లా రైతులు ఆదిలాబాద్ కు వెళ్లవలసి వచ్చిందని, దీంతో వ్యయ ప్రయాసలు కావడమే కాకుండా త్వరితగతిన భూసార పరీక్షలు జరిగేవి కావన్నారు. రైతుల ఇబ్బందిని గమనించిన ప్రభుత్వం రూ.30 లక్షల వ్యయంతో భూసార పరీక్షా కేంద్రాన్ని నిర్మించిందన్నారు.
భూసార పరీక్షలు ప్రతి ఒక్క రైతు జరిపించుకొని శాస్త్రవేత్తల సూచనలు, సలహాల మేరకు అనువైన పంటలు పండించాలని సూచించారు. వరికి బదులు ఫామాయిల్ సాగు చేస్తే అధిక లాభాలు ఉంటాయని, ఒక్క ఎకరం వరి సాగుచేసే కంటే అదే ఎకరంలో నాలుగు రెట్ల పామాయిల్ సాగుచేయవచ్చన్నారు.
ఫామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటన కోసం అశ్వరావు పేటకు పంపించే ఏర్పాటు చేయాలని మంత్రి వ్యవసాయ అధికారులకు సూచించారు. ఫామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మొదటి సంవత్సరం నకు 26 వేలు, రెండవ సంవత్సరం నకు 5 వేలు, మూడో సంవత్సరం నకు 5 వేల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు.
వ్యవసాయంలో మెళుకువలు తెలుసుకొని ఆధునిక పద్ధతులను పాటించే రైతులు వ్యవసాయం చేయాలన్నారు. అనంతరం మంత్రి దేసి (DAESI) ప్రోగ్రామ్ కింద శిక్షణ పొందిన 38 మంది డీలర్లకు సర్టిఫికెట్స్ అందరు చేశారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ రఘునందన్ రెడ్డి, నిర్మల్, ఖానాపూర్, బైంసా, ముధోల్, కుబీర్ మార్కెట్ కమిటీల చైర్మన్లు, జడ్పీటీసీ లు , నిర్మల్ జిల్లా మండల అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఏడీ ప్రసాద్ జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఏడీలు కోటేశ్వర్ రావు, వినయ్ బాబు, వీణ, ఇంద్రసేన్, ఏవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.