జయశంకర్ భూపాలపల్లి, జనవరి 5 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్లలో పునాదుల పరిశీలన పనులు శుక్రవారం ప్రారంభమయ్యా యి. నిర్మాణ సంస్థలు బరాజ్ల ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను డైనోసార్, పార్సన్ కంపెనీలకు అప్పగించగా.. సదరు కంపెనీలు ఇన్వెస్టిగేషన్ పనులను ప్రారంభించాయి. డైనోసార్ కంపెనీ ప్రతినిధులు ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ టెస్ట్ (ఈఆర్టీ)ను నిర్వహించి పిల్లర్ కుంగుబాటుకు గల కారణాలను అన్వేషిస్తున్నట్టు సమాచారం. విచారణ పూర్తయితే 19, 20, 21 పిల్లర్ల వద్ద కాఫర్ డ్యాం పనులను వేగవంతం చేసేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమవుతున్నది. విచారణ నివేదిక ఆధారంగా మూడు పిల్లర్లను డైమండ్ కటింగ్ ద్వారా తొలిగించి మళ్లీ నిర్మాణ పనులు చేపట్టే అవకాశాలున్నాయి. అన్నారం బరాజ్లోని 28, 38 ఔట్లెట్ల వద్ద ఏర్పడిన చిన్న చిన్న సీపేజ్లకు ట్రీట్మెంట్ చేయడానికి ఆప్కాన్ సంస్థ సిద్ధమైంది. పాలీ యూరిత్రిన్ కెమికల్ను సీపేజ్లలో గ్రౌటింగ్ చేయనున్నారు. ఆప్కా న్ కంపెనీ.. అన్నారం బరాజ్ ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను పార్సన్ కంపెనీకి అప్పగించింది.