హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమ్స్ సందర్భంగా టీఎస్పీఎస్సీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. గ్రూప్-1 పరీక్ష ఇన్విజిలేటర్లుగా వ్యవహరించే వారికి పరీక్ష నిబంధనలపై ఏ మేరకు అవగాహన ఉన్నదో పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించింది. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్మిశ్రా ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. జిల్లా పరిధిలోని ఇన్విజిలేటర్లకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహించారు. ‘పరీక్ష ఎన్ని గంటలకు? ఎన్ని మార్కులకు? ఏ పెన్ను ఉపయోగించాలి? పరీక్ష కేంద్రంలో సమయాన్ని ఎలా గమనించాలి? పరీక్షకు ఎన్ని గంటల వరకు అనుమతిస్తారు? ఎన్ని గంటల వరకు పరీక్ష జరుగుతుంది?’ ఇలాంటి 30 ప్రశ్నలతో పరీక్ష నిర్వహించారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మల్టిపుల్ చాయిస్లు ఇచ్చారు.
ఈ పరీక్షలో ఇన్విజిలేటర్లు అంతా వంద శాతం మార్కులు సాధించడం విశేషం. టెస్ట్ నిర్వహించిన కలెక్టర్ భవేశ్ మిశ్రాను టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు శనివారం ఇదే విధానంలో పరీక్ష నిర్వహించాలని సూచించారు. దీనివల్ల పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లకు సందేహాలు రాకుండా ఉంటాయని, వారు చేసే పొరపాట్ల వల్ల అభ్యర్థులెవరూ నష్టపోకుండా ఉంటారని చెప్పారు. గతంలో ఇన్విజిలేటర్లు సంతకం చేయకపోవడం, అభ్యర్థి కూడా ఆ విషయాన్ని గమనించకపోవడం వల్ల అభ్యర్థి నష్టపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఒక్క పేపర్పై ఇన్విజిలేటర్ సంతకం లేకపోయినా ఆ పేపర్ను ఇన్వాలిడ్ చేస్తారని తెలిపారు.