హైదరాబాద్ : ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే విధంగా నియోజకవర్గానికి 100 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని మొదటి విడతగా అమలు చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
జనగామ కలెక్టర్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులతో కలిసి మంత్రి సోమవారం దళితబంధు అమలు పై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళితబంధు పథకం దేశంలోనే విశిష్టమైన, అరుదైన పథకం అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అనేక నూతన పథకాల్లో దళితబంధు వినూత్న పథకంగా మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలో 100 మందికి, రూ.10 లక్షల చొప్పున, బ్యాంక్ లింకేజ్ లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అయ్యే విధంగా సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని చెప్పారు.
జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత సమన్వయం చేయడానికి అధికారులను నియమించామని చెప్పారు. జనగామకు ఆర్డీవో మధు మోహన్, స్టేషన్ ఘనపూర్కు డీఆర్డీవో రామ్ రెడ్డి, పాలకుర్తికి డీపీవో రంగాచారి ఇంచార్జీ లుగా ఉంటారని తెలిపారు.
అలాగే స్టేషన్ జనగామ నియోజకవర్గంలో 24,209 దళిత ఇండ్లు ఉండగా, 84,530 జనాభా ఉందని, పాలకుర్తి నియోజకవర్గం లో 19,093 ఇండ్లు ఉండగా, 67,825 జనాభా ఉందని, జనగామ నియోజకవర్గం లో 17,516 ఇండ్లు ఉండగా, 62,260 జనాభా ఉందని అన్నారు.
ఈ మూడు నియోజక వర్గాల్లో 60,818 ఇండ్లు ఉండగా, 2,14,615 మంది దళిత జనాభా ఉందని మంత్రి వివరించారు.
అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో వేసే కమిటీల అధ్వర్యంలో సీఎం ఆశయాలకు అనుగుణంగా అంతా కలిసి కట్టుగా సమన్వయంతో పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశాలిచ్చారు.