హైదరాబాద్ : కొవిడ్-19తో రాష్ట్ర ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు అజయ్ బాబు(59) కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. అజయ్ 1978లో గౌహతిలోని జరిగిన స్కూల్ నేషనల్స్ ద్వారా అరంగేట్రం చేశాడు. 1979, 1980 లలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించాడు. ఎల్బీ స్టేడియంలో మొదటి బ్యాచ్ స్పోర్ట్స్ హాస్టల్లో సభ్యుడిగా ఉన్నాడు. 1982లో చెన్నైలో జరిగిన సంతోష్ ట్రోఫీలో ఏపీ తరపున పాల్గొన్నాడు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జట్టుతో పాటు స్టేట్ జట్టులో సభ్యుడైన అజయ్ జాతీయస్థాయిలో అనేక టోర్నమెంట్లలో రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అజయ్బాబు మరణం పట్ల తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహద్ అలీ రాఫత్, కార్యదర్శి జీపీ పాల్గున, చైర్మన్ కేటీ మాహి సంతాపం తెలిపారు.