హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ పిలుపు మేరకు సోమవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పెండింగ్ బిల్లుల సాధన కోసం అసెంబ్లీ వైపు వెళ్తున్న మాజీ సర్పంచ్లను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. హైదరాబాద్లోని మానవహకుల కమిషన్ కార్యాలయం వద్ద ఇంటెలిజెన్స్ పోలీసుల సహకారంతో భారీగా మోహరించిన బలగాలు నిరసనకారులను అరెస్టు చేశారు.
అనంతరం వారిని అబిడ్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. 2019-24లో అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, ఇప్పటికీ బిల్లులు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక మాజీ సర్పంచ్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చినా, వాటిని మాజీ సర్పంచ్లకు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. జేఏసీ ఉపాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగయ్య, నాయకులు పాల్గొన్నారు.