హైదరాబాద్, అక్టోబరు 5 (నమస్తే తెలంగాణ) : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా పరిషత్తు చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి టీఆర్ఎస్లో చేరారు. బుధవారం బేగంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నాయకత్వంలో నల్లాల దంపతులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్లో చేరిన నల్లాల ఓదెలు, భాగ్యలక్ష్మి తిరిగి గులాబీ నీడకు చేరారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.