Harish Rao | సీఎం రేవంత్రెడ్డి దగ్గర విషయం లేదని.. అందుకే విషయం చిమ్ముతున్నాడని.. ఆయన అతి తెలివిని బంద్ చేయాలంటూ మాజీ మంత్రి హరీశ్రావు హితవు పలికారు. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ మాట మీద నిలబడేవాడైతే ఇచ్చిన హామీలు అమలు చేసి ఓటు అడగాలన్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మన ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించ లేదని స్పష్టం చేశారు. కృష్ణా నీటిలో 50శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని, తాగునీటిలో 20శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని షరతు పెట్టామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ప్రాజెక్టులను అప్పగించి సంతకం పెట్టిందని.. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిందన్నారు. రేవంత్ దగ్గర విషయం లేదు కనుకే విషం చిమ్ముతున్నాడన్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని బిల్లు పెట్టి పాస్ చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. బిల్లును తయారు చేసింది మీ జైపాల్ రెడ్డి, జైరాం రమేశ్ కాదా? అని నిలదీశారు. రేవంత్కు ఆలోచన లేక, అర్థం కాక ఆగమాగమై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి నీటి సమస్యలను తీసుకొస్తున్నాడని.. హైదరాబాద్కు మంచినీటి సమస్య వస్తుందని హెచ్చరించారు.
ప్రాజెక్టులకు బోర్డుకు అప్పగిస్తే ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్కు సాగునీరు, తాగునీటికి సమస్య వస్తుందన్నారు. పోతిరెడ్డిపాడుపై మాట్లాడే అర్హత రేవంత్కు లేదన్నారు. ఆనాడు టీడీపీలో ఉన్న రేవంత్ పోతిరెడ్డిపాడుపై స్పందించలేదని.. పెదవులు మూతపడ్డాయి అంటూ విమర్శించారు. రేవంత్ నీ వీపు చూసుకుని మాట్లాడాలన్నారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో గట్టిగా పోరాడింది బీఆర్ఎస్సేనన్నారు. పోతిరెడ్డిపాడుకు బొక్క కొట్టి నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని 30 రోజులు స్తంభింపజేశామంటూ గుర్తు చేశారు. ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లా మీ ముఖాన విసిరేసిన చరిత్ర మాదన్నారు. సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ పైనే పడుతుంది రేవంత్రెడ్డి అన్నారు.
సబ్జెక్ట్ లేక చవకబారు మాటలు మాట్లాడుతున్నావని.. నీ మాటలు టీవీలో చూస్తే పిల్లలు అసహ్యించుకుంటారన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని వెంకయ్య నాయుడు ఉదయం రేవంత్కు చెప్పారని.. రేవంత్ మధ్యాహ్నం చిల్లర మాటలు, అసభ్యపు మాటలు మాట్లాడారన్నారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పెట్టు, నీకు దిమ్మతిరిగే సమాధానం చెప్తాం బిడ్డా అంటూ సవాల్ విసిరారు. మేం గతంలో చర్చకు పెడితే ప్రిపేర్ కాలేదని కాంగ్రెస్ తప్పించుకుందని.. మేం అలా కాదు, ధైర్యంగా చర్చకు వస్తామన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడూ అలాగే మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. రైతుబంధు, పింఛన్ పెంపు, ఉచిత కరెంట్, రుణమాఫీ హామీలపై మాట తప్పింది మీరు కాదా? అంటూ నిలదీశారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని మనం తప్పకుండా గెలవాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడాలంటే ఎంపీ ఎన్నికల్లో విజయం పాధించాలన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని.. పట్టుదలతో పనిచేయాలన్నారు.