కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలి. మన బడ్జెట్ రూ. 2.90 లక్షల కోట్లు మాత్రమే. ఎలాగూ అధికారంలోకి రామని అరచేతిలో వైకుంఠం చూపేలా మ్యానిఫెస్టో పెట్టారు. ఇప్పుడు హామీల సంగతి చూడమంటే అవసరంలేని విషయాలు తెరపైకి తెస్తున్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. గ్యారెంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుంది. మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారెంటీల చావువార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు.
-హరీశ్రావు
Niranjan Reddy | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గడం అంటే కరెంటు సమస్య, పెట్టుబడి సమస్య, నీళ్ల సమస్య ఉన్నట్టేనని మాజీమంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కృష్ణా బేసిన్లో నీటిని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలు వేసుకున్నారని, గోదావరి బేసిన్లో నీళ్లుండడంతో రెండోపంటకు సరిపోతాయని భావించి నార్లు పోసుకున్నారని తెలిపారు.
సాగువిస్తీర్ణం తగ్గుతున్నదని పత్రికల్లో వార్తలు రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పెట్టుబడి కింద ఇచ్చే రైతుబంధు సాయాన్ని ఎకరం లోపు ఇచ్చి ఆపేశారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. నీళ్లు ఇస్తరో, ఇవ్వరో స్పష్టత లేదని విమర్శించారు. కరెంటు కోతలు ఉంటాయని ప్రభుత్వం అధికారికంగానే చెప్తున్నదని, చాలా జిల్లాల్లో కరెంటు 16-17 గంటలు కూడా రావడం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పారని, కాబట్టి ఇస్తరా? ఇవ్వరా? స్పష్టంగా చెప్పాలని నిలదీశారు.
నీళ్లు, పెట్టుబడి విషయంలో ప్రభుత్వం తీరిగ్గా స్పందిస్తే వ్యవసాయం ఆగదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రైతులకు విశ్వాసం కల్పించలేకపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతులు క్యూలలో నిల్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకురావడం కంటే రాజకీయాల గురించే ఎక్కువ మాట్లాడుతున్నారని నిరంజన్రెడ్డి విమర్శించారు.