Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. హెచ్సీయూ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్పై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు.
నేడు నల్లగొండ జిల్లా, మర్తినేని గూడెం మాజీ సర్పంచ్ బండమీది రామును అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇలా ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారు రేవంత్ రెడ్డి గారు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? అని హరీశ్రావు నిలదీశారు.
అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాం. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయించేదాకా బిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు. ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం. ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం అని హరీశ్రావు తేల్చిచెప్పారు.